
రాష్ట్రంలో విభిన్న సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టే వారిని ప్రజాస్వామ్య వాదులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంతే కాదు కవిత మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తోంది. స్వయంగా కవిత సైతం తనపై వచ్చిన ఆరోపణలు తిప్పకొట్టడమే కాదు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఢిల్లీ పాలకులపై పోరాడి పీఠాలు కదిలించిన ఘన చరిత్ర రాష్ట్రం సొంతమన్నారు కవిత. స్వయం సమృద్ధితో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ కుట్రలను ఛేదించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని కవిత పేర్కొన్నారు. ముుఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్న తరుణంలో కొందరు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే నీచానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు, బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఇక కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ దామోదర్రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ అరికపూడి గాంధీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సహా పలువురు ప్రముఖులు నిన్న కవితను ఆమె నివాసంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఇక ఆరోగ్య మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. దర్యాప్తు సంస్థలు కేంద్రానికి జేబు సంస్థలయ్యాయా అనే అనుమానం వస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనను వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు. సీబీఐ నోటీసులు వస్తాయని దిల్లీలో భాజపా ఎంపీ మాట్లాడుతున్నారని.. దర్యాప్తు సంస్థల ప్రకటనలను పార్టీ నేతలే ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. నీతిమంతులు.. లేదంటే అవినీతివంతులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో మతకల్లోలాలకు ఎవరు కారణమో ప్రజలకు తెలుసన్న హరీశ్ రావు.. హైదరాబాద్లోనూ అదే పరిస్థితి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.